Author: mschandar

‘బీమా’ సేనులు!

‘ప్రాణ వాయువు లేక పోయినా బతకొచ్చు.
కట్టుకున్న పెళ్ళాం పక్కింటి వాడితో లేచిపోయినా బతకొచ్చు.
కానీ…
పదవి లేక పోతే ఎలా?’
అప్పుడెప్పుడో వచ్చిన ‘ప్రజానాయకుడు’ అని ఒక మహాపాత చిత్రంలో నాగభూషణం అన్న మాటలు.
ఇప్పుడు చూడండి. తాగేసిన కూల్‌ డ్రింక్‌లో స్ట్రాలాగా, ముఖం తుడుచేసుకున్న టిష్యూ పేపర్‌లాగా, చూసేసిన సినిమా టికెట్‌లాగా.. రాజీనామా పత్రాలను విసిరేస్తున్నారు మన ప్రజాప్రతినిథులు.

యుగ స్పృహ

నా భూమి నాది కాదన్నారు
విప్లవ వాదినయ్యాను

నా దేహం నాది కాదన్నారు
స్త్రీవాదినయ్యాను

ముఖ చిత్రం

నాకో ముఖముండాలి
ఇక్కడే ఎక్కడో వదలిపెట్టాను
దేశానికి జెండా కూడావుండాలి…నా కనవసరం
ముందు నా ముఖం సంగతి తేల్చండి

బిత్తర కుమారులు

ధైర్యం గురించి పిరికివాళ్ళు లెక్చర్లు దంచినట్టుగా – ఎవ్వరూ దంచలేరు. ఉత్తర కుమారుడు మాట్లాడినట్లు అర్జునుడు మాట్లాడలేడు కదా!
ధైర్యం గురించి ఎవర్ని అడిగినా చాలా పెద్ద పెద్ద ఉదాహరణలిస్తుంటారు. గుండుకు బదులు గుండె చూపిన నాయకుడి గురించో, నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వీరుడి గురించో మాట్లాడతారు.
అంతంత పెద్ద విషయాల గురించి ఎందుగ్గానీ, చిన్న చిన్న విషయాల్లో ధైర్యం ఉంటుందా…?

ఉద్యమం ప్రయివేట్‌ లిమిటెడ్‌!

ఉపఎన్నిక పెట్టి చూడు, ఉద్యమం చేసి చూడు- అన్నారు. ఎవరూ? ‘ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు’ అన్న పెద్దలే. చేతులు కాల్చుకున్నాక కానీ, పిన్నలు, పెద్దలు కాలేరు లెండి.
ఎన్నిక వేరు. ఉప ఎన్నిక వేరు. రెంటి మధ్యా, ఇల్లుకీ, చిన్నిల్లుకీ వున్నంత తేడా వుంటుంది. నార చీర పెట్టినా మురిసి పోతుంది ఇంటావిడ. పట్టు చీర పెట్టేవరకూ ప్రాణం తీస్తుంది చిన్నింటావిడ. ఎన్నికప్పుడు వోటరు వంద నోటు చూసి ఒప్పేసుకుంటాడు. ఉప ఎన్నిక వోటరు మాత్రం- కనీసం వెయ్యి నోటు కళ్ళ చూడాలంటాడు.
ఇక ఉద్యమం అంటారా? ఉప ఎన్నిక కన్నా ‘ప్రియమైనది’. అసలు ఉద్యమం అంటే ఏమిటి?(కాస్సేపు పిడికిళ్ళు బిగపడతారా?ఎఫెక్టు కోసం!) ఉద్యమానికి త్యాగమే ఊపిరి. ఎందర త్యాగ’ధనుల’ పుణ్యమే ఒక ఉద్యమం.( చాల్లెండి. పిడికిళ్ళు సడలించండి.)

సీన్‌ కట్‌ చేస్తే…!

చిరంజీవి సినిమాల్లో నటిస్తారా? నటించరా?
నటించక పోతే ప్రాణత్యాగంకూడా చేస్తామనగలరు అభిమానులు.( అన్నట్టు అభిమానులనేవాళ్ళు నటించరండోయ్‌! అన్నంత పనీ చేసేస్తారు.)
నటిస్తే రాజకీయంగా ఎలా ఎదగ్గలవంటారు- పార్టీ కార్యకర్తలు. సొంత పార్టీ కార్యకర్తలకయితే ఏదో ఒకటి నచ్చచెప్పుకోవచ్చు. దత్తత పార్టీకి ఎలా చెప్పుకుంటారు?
సినిమాల్లో పూర్తికాలం నటిస్తే హీరోల్లో మొదటి స్థానం.
రాజకీయాల్లో జీవిస్తే అందుకు తగ్గ పాత్ర ఒక్కటే వుంది: ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రా? మెగా హీరోనా?

కదిలేదీ, కదిలించేదీ చేతి ‘చమురు’ వదించేదీ…!

నిజమే మరి. ఏ భావకవికీ ఎందుకు తట్టలేదో తెలియదు కానీ,
ప్రేమను పెట్రోలుతో, కాపురాన్ని గ్యాస్‌తోనూ ఏనాడో పోల్చి వుండాలి.
బైకున్న ప్రతీవాడూ ప్రియుడు కాలేడు. బండిలో చమురున్నవాడే రొమాంటిక్‌ హీరో. లేకుంటే బస్సు లో వెళ్ళే మిస్సుకు లిఫ్ట్‌ ఇవ్వలేడు. మిస్సును మిస్సయ్యాక కానీ, వెర్రి రోమియోకి తత్వం బోధపడదు: పెట్రోలు లేకుండా బండే కాదు, ప్రేమ కూడా స్టార్ట్‌ కాదు.
ఇన్నాళ్ళూ అన్యోన్యతంటే ‘గ్యాస్‌’ అనుకునే వాళ్ళం. ఇప్పుడు కాపురమే ‘గ్యాస్‌’గా మారింది. ‘స్టౌ మీద కొంచెం టీ పెట్టుకుందామా?’ అని ఎంత ప్రజాస్వామికంగా ఆయన అడిగినా ఆవిడ భగ్గుమంటుంది. ‘బండ మీద యాభయి పెరిగింది.’ పాపం ఏంచేస్తాడతడు. టీవేడినే కాదు, ఆవిడ వేడిని కూడా ఒక ఫ్లాస్కులో దాచే ప్రయత్నం చేస్తాడు. గంట తర్వాత కాపురం లాగానే ఫ్లాస్కులో టీ కూడా చల్లారిపోతుంది. ముందు టీ మీదా, తర్వాత జీవితం మీదా విరక్తి కలుగుతుంది.
చూశారా? ఐడియా కాదు- ఒక గ్యాస్‌బండ మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్కొక్కడు ఇదే గ్యాస్‌ బండతో తన జీవిత భాగస్వామినే మార్చేసుకుంటాడు.(వరకట్న హత్యకు వంటగ్యాస్‌కు మించిన ఆయుధం లేదు కదా!) అది వేరేవిషయం. కాలం మారిపోయింది మరి. పూర్వపు రోజుల్లో అగ్ని సాక్షిగా పెళ్ళి మాత్రమే చేసుకునే వారు. ఇప్పుడు కాపురమూ ‘అగ్ని’ సాక్షిగానే చెయ్యాలి. విడాకులూ ‘అగ్ని'(స్టౌ సాక్షిగా) పుచ్చుకోవాలి.
పుట్టింది ఒక్క చోటయినా, ‘శుధ్ధి’ చేసేవాళ్ళు ‘వర్ణాన్ని’ బట్టి, ఇది ‘పెట్రోలు’ అనీ, ఇది ‘డీజిల్‌’ అనీ, ఇది ‘కిరోసిన్‌’ అనీ అంతరాలు సృష్టించారు.
పెట్టిపుట్టిన వాళ్ళు పెట్రోలు వాడతారనీ, కాయికష్టం చేసేవాళ్ళు కిరోసిన్‌ వాడతారనీ ఏలిన వారు గ్రహించేసి ఇన్నాళ్ళూ వడ్డించే విషయంలో కొంత సామాజిక నాయ్యానికి ప్రయత్నించేవారు. పెట్రో సంపన్నుల్ని కొట్టి కిరోసిన్‌ పేదలికి పెట్టిన బిల్డప్‌ ఇచ్చే వారు.
అటు ‘అగ్ర’వర్ణానికి ఎక్కువా, ఇటు ‘నీచ’వర్ణానికి తక్కువా- అన్నట్లు ఓ మధ్యస్తపు చమురు వుంది. దాని పేరే డీసెల్‌. నడమంతరపు మధ్యతరగతిని నిజంగానే నడిపించేది డీసెల్‌. జనరవాణాసాధనాలు- బస్సులయినా, రైళ్ళయినా- ఎక్కువగా కదిలేది డీసెల్‌ మీదనే.
అసలే మధ్యతరగతి వాడు ఒంటెత్తు మనిషి. ‘నా భార్య, నా ఇల్లు, నా బిడ్డ. నాకుక్క… ‘ఈ వృత్తం దాటి బయిటకు పోడు. ఈ మధ్య ఈ జాబితాలోకి ‘నా కారు’ కూడా చేరిపోయింది. అన్ని రోజులూ ముసుగు వేసి వుంచి ఆదివారం పూట బయిటకు తీస్తాడు. ‘నా..’ అనుకున్న వారిని అందులో ఎక్కించుకుని ధియేటర్‌ వరకూ వెళ్ళి, సినిమా చూపించి, పరమ చీప్‌గా వుండే పాప్‌ కార్న్‌ మాత్రమే తినిపించి, జాగ్రత్త వెనక్కి తెచ్చేసి ఇంటి ముంగిట పార్క్‌ చేసేస్తాడు. ఎక్కడా ఎవరికీ కూల్‌ డ్రింక్‌ కూడా తాగించడు. మనిషయితే ఏమీ తాగకుండా కొన్ని గంటలుండగలడు. కానీ కారన్నాక తాగకుండా వుంటుందా? కాకపోతే అది మధ్యతరగతి వాడిది కాబట్టి పెట్రోలు తాగకుండా, మధ్యస్తపు చమురు- డీజెల్‌నే తాగుతుంది. ఇప్పుడు వెనకా ముందూ చూడకుండా దాని మీదా వడ్డించేశారు. ఇక వారానికి కాకుండా నెలకొక సారి మాత్రమే మన మధ్యతరగతి మానవుడు, కారు ముసుగు తీస్తాడు.
ఈ చమురు వర్ణ వ్యవస్థలో మిగిలిపోయింది గ్యాస్‌ బండ కదూ? మరి స్థానం ఏమిటి? ఏ వర్ణంలోనైనా స్త్రీ స్థానం మారదు. అన్ని వర్ణాల్లోనూ లోకువయిన వర్ణం ఆమెది. గ్యాస్‌ బండదూ అంతే. అది కూడా వంటింటి కుందేలే. స్త్రీలను ఉధ్ధరించే పేరు మీద ఈ బండను కదిలించే పని చేయదు సర్కారు. అలా చేస్తే వంటింటి విప్లవం వస్తుందని వారికి అనుమానం.
కట్టెల పొయ్యి ముందు కూర్చున్న కన్నతల్లిని చూసి కడుపు తరుక్కు పోయిందట ఒకాయనకి. ఊదిఊది ఆమె ఊపిరితిత్తులు అలసి పోయయానీ, పొగతో కళ్ళన్నీ మండిపోయాయనీ, ఆమెను విముక్తం చెయ్యటానికి ఈ బండను తెచ్చి ఇంట్లో పెట్టాడు. కట్టెల పొయ్యిని వెలిగించటానికి ఒక్క ఊపిరి చాలు. కానీ బండను వెలిగించటానికి ఊదాల్సింది ఊపిరిని కాదు- కష్టార్జితాన్ని.
నీరు పల్లమెరుగు- అన్నది ఎంత నిజమో తెలియదు కానీ, చమురు ఎత్తులెరుగు- అన్నది మాత్రం సత్యం.
చమురు-పాలక పక్షంలో వున్న వారికిచల్లగానూ, ప్రతిపక్షంలో వున్నవారికి వేడిగానూ వుంటుంది.
అందుకే ధర పెరిగినప్పుడు- వీళ్ళు చిరునవ్వులు చిలికిస్తుంటూ, వాళ్ళు భగభగలాడిపోతుంటారు.
అయితే ప్రతిపక్షాల వారిని ఇప్పుడు కొంచెం సానుభూతి తో అర్థం చేసుకోవాలి. వారికీ హృదయముందని భావించాలి. మరీ ముఖ్యంగా నిరసనలూ, ఆందోళనలూ పేరు మీద రోడ్డెక్కే కొన్ని పక్షాలకు ఇవాళ స్త్రీల కష్టాలు తెలిసిపోయాయి.
మరీ ముఖ్యంగా రోడ్ల మీదే వంటా, వార్పులూ చేశాక వీరికి ఆడవాళ్ళ శ్రమ నిజంగా అర్థమయింది. గరిటె తిప్పటమంటే, (రాజకీయాల్లో) చక్రం తిప్పటమంత సులువు కాదని తెలిసిపోయింది.
వీరిలో చాలామంది తొలిసారిగా ఉల్లిని తరిగి కన్నీళ్ళు తెచ్చుకున్నారు. పొయ్యిని దర్శించుకుని మసిబారి పోయారు. చేతులు కాల్చుకున్నాకే (విస్తరి) ఆకుల్ని పట్టుకున్నారు.
అందుకే గ్యాస్‌ మీద వడ్డించినందుకు వీరికి ఆగ్రహం కలగాలి.
‘వేరు కుంపటి’ పెట్టాలంటే, అందరి మద్దతూ కావాలి కదా!

-సతీష్‌ చందర్‌
25-6-11

రాను, రాను
ప్రేమలు ప్రియమయి పోతున్నాయి; కాపురాలు ఖరీదయిపోతున్నాయి.
ఇవాళ ప్రేమించాలంటే.., విశాలమయిన హృదయముంటే సరిపోదు, లోతయిన బావి వుండాలి. బావి అంటే అల్లాటప్పా నీళ్ళ బావి కాదు, చమురు బావి వుండాలి.
అప్పుడు, ఆ ప్రేమ అరబ్బువాడి ప్రేమలాగా వెలిగిపోతుంది. ఏడుపదుల వయసొచ్చినా, మూడు పదుల మనువులతో మెరిసిపోతుంది. ‘తలాకు’లు ‘తలాకు’లుగా… విడాకులు విడాకులుగా ఎప్పటికప్పుడు చిగురిస్తుంటుంది.
నిజమే మరి. ఏ భావకవికీ ఎందుకు తట్టలేదో తెలియదు కానీ,
ప్రేమను పెట్రోలుతో, కాపురాన్ని గ్యాస్‌తోనూ ఏనాడో పోల్చి వుండాలి.

హోంవర్క్‌ అడగలేదోచ్‌!

ఈ ప్రజాస్వామ్యం ఏమిటో కానీ,
ఇక్కడ ఎవ్వరూ హోం వర్క్‌ చెయ్యరు.
వోటరు దగ్గర నుంచి బ్రోకరు వరకూ, కేడర్‌ మొదలు లీడర్‌ వరకూ- అంతే. ఒక్క ‘మందు’ తప్ప ఏదీ ముందు సిధ్ధం చేసుకోరు.( వీరికి ముందు జాగ్రత్త అనే మాట ‘మందు’ జాగ్రత్త లాగా వినిపిస్తుంది).
పోటీలో వున్న ఫోర్‌ట్వంటీలెందరో కనీసం లెక్కకూడా పెట్టుకోడు వోటరు.
‘నేను ‘నొక్కాల్సిన’ ఫోర్‌ట్వంటీ గాడెవడో చెప్పు. మిగతా వాళ్ళు నాకనవసరం’ అని బూత్‌లోకి వెళ్ళే ముందు అడిగి వెళ్ళి ‘ఈవీఎం’ (ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్‌) మీట నొక్కేసి వస్తాడు. ఎన్నో వేలిముద్రలు నొక్కిన వాడికి ఈ ముద్రో లెక్కా?

భయ..భయ..భయహే!

ఆయుధమంటే చాలు అదిరిపడి చస్తారు ఎందుకో..?
ఉన్నట్టుండి యోగా(రామ్‌ దేవ్‌)బాబా తన అనుచరులకు ‘శస్త్రం’ ఇస్తానన్నారు. చిదంబరం నుంచి ఏకాంబరం వరకూ దేశంలో అందరూ ఉలిక్కి పడ్డారు.
గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన అభిమానులకి లాఠీలు(కర్రలు) ఇచ్చి ప్రదర్శన చేయించారు. అవీ ఆయుధాలే కదా! అప్పుడూ ఇలాగే… అందరూ ‘బుర్రలు బద్దలు కొట్టు’కున్నారు.. లాఠీలతో కాదు… సందేహాలతో…!
‘ఇతను ఉగ్రవాదిలా రెచ్చిపోతున్నాడేమిటి..? కొంప దీసి ‘ఆల్‌ ఖైదా’ లాగా ‘లాల్‌ ఖైదా’ లాంటి సంస్థను గాని స్థాపించలేదు కదా- అని అనుమానించారు కదా!

విశ్వాసానికి విడాకులు

విశ్వాసం వుండాల్సింది కుక్కలకీ నక్కలకీ కానీ, మనుషులకెందుకు చెప్పండి?
ఇప్పుడు ఉంటున్న ఇంటికి తాళం వేస్తున్నారు. ఒకప్పుడు ఉంచుకున్న ఒంటికి తాళం వేసే వారు. ఎందుకూ? అవిశ్వాసం? మనుషుల్లో దొంగ మనుషులుంటారనీ, వారు కన్నం వేస్తారనీ- గొప్ప అవిశ్వాసం.
కుక్కలతో అలాంటి పేచీలేదు. వాటిల్లో మహాఅయితే పిచ్చికుక్కలు వుంటాయేమో కానీ, దొంగ కుక్కలు వుండవు.
అందుకే అవిశ్వాసమన్నది ముమ్మాటికీ మానవ ప్రవృత్తి.
కోతి నుంచి మానవుడు అవతరించే పరిణామ క్రమంలో, మెల్లిగా తోక అంతరించిపోతూ, దాని స్థానంలో అవిశ్వాసం పెరుగుతూ వచ్చింది.

అర్థనీతి పరులు

అవినీతిని చూస్తే ఒకప్పుడు కోపం వచ్చేది. కానీ ఇప్పుడు కడుపు మంట పుడుతోంది.
రూపాయి మీద ఒట్టు. కోపం వేరు. కడుపు మంట వేరు.
అందగత్తె ఐశ్యర్యారాయ్‌ను చూస్తే అనాకారులయిన అప్పలమ్మలకి వచ్చేది కోపం; కానీ అంతో ఇంతో అందగత్తెలకు వచ్చేది మాత్రం కడుపు మంటే.
బుద్ధివున్న వాణ్ణి చూస్తే, బుర్రలేని వాడికి వచ్చేది కోపం; సగం బుర్ర వున్నవాడికి వచ్చేది కడుపు మంట.
అలాగే..,
బిర్యానీ మెక్కే వాణ్ణి చూస్తే , తిండి లేనివాడికి వచ్చేది కోపం; తెల్లన్నం తినేవాడికి వచ్చేది కడుపు మంట.
ఇప్పుడు దేశం మొత్తం… కోపంతో ఊగిపోవటం లేదు. కడుపు మంటతో కాలిపోతోంది. కారణం అవినీతి.

సీత చేతి ఉంగరం

వాగ్గేయకారుడుగా జయరాజు తెలుగువారికి సుపరిచితుడు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆయన పాటలు వినని వారుండరు. పలు చిత్రాలకు ఆయన పాటలు రాశారు. వామపక్ష ఉద్యమాలకు బాసటగా ఆయన సాహిత్యం నిలిచింది. కార్మికనేతగా, కళాకారుడిగా ఆయన ఉద్యమజీవితంగా సాగించారు. సాగిస్తున్నారు కూడా. ఆయన తన పాతికేళ్ళ సాహిత్యప్రస్థానానికి గురుతుగా వేసిన ‘వసంత గీతం’ పుస్తకానికి రాసిన ముందు మాట ఇది.

నిన్నటి కలలే నేటి అలలు!

శ్రీశ్రీ పక్కన నిలుచున్నా, సముద్రపు వొడ్డున కూర్చున్నా ఒక్కటే. చిరుకోపం వుంటే మహోద్రేకమవుతుంది. కొంచెం దు:ఖమే కావచ్చు. దావాలనమవుతుంది. చిన్ననవ్వే పెనుసంబరంగా మారుతుంది.
శ్రీశ్రీ సముద్రమంతటి ఉత్ప్రేరకం. వామనుడికి సైతం విశ్వరూపాన్ని ప్రదర్శించగల శక్తి అది. శ్రీశ్రీ చైన్నైలో వున్నా, విశాఖలో వున్నా సముద్రాన్ని ప్రేమించేవాడు. సముద్రంలేని చోట వుండటానికి ఇష్ట పడేవాడు కాడు.
డెరెక్‌ వాలకాట్‌కి సముద్రమంటే ఎంత ఇష్టమో, శ్రీశ్రీకీ సముద్రమన్నా అంతే ఇష్టం. సముద్రాన్ని కోల్పోవటం చిన్న విషయం కాదు. ‘సముద్రాన్ని కోల్పోయిన జీవితం దేహాన్ని కోల్పోయిన వస్త్రం లాంటింద’న్నాడు వాల్‌కాట్‌ చమత్కారంగా.

‘కడగని’ పాత్రలు ఈ ‘నెగెటివ్‌’లు!

ఇలా రాసిందే రచన- అని ఏ రచయితనీ బెదరించలేం. ఇలా పెట్టిందే గుడ్డు- అని ఏ పిట్టనీ

వణికించలేం. అలా చేస్తే రాసింది రచనా కాదు. పెట్టింది గుడ్డూ కాదు. రచయితలంతా పుస్తకాలలోనుంచో,

విశ్వవిద్యాలయాల్లోంచో, పత్రికల్లోంచో పుట్టుకురావాలన్న షరతు కూడా లేదు. కల్లు కాంపౌండులోంచో, రెడ్‌ లైట్‌

ఏరియాలోంచో, వెలివాడలోంచో రచయిత పుట్టుకురావచ్చు. గుడ్లు పెట్టే వన్నీ ఫోరం కోళ్ళే కావాలని రూలు

లేదు. అడవిలోని కోడి కూడా గుడ్డు పెడుతుంది.
కెమెరా విజయకుమార్‌ రాయలని పథకం వేసుకుని రాయలేదు. రాయకుండా వుండలేక

రాసేశాడు. తాను వెనక్కి తిరిగి చూసుకునే సరికి రచయిత అయిపోయాడు. ఇంకేచేస్తాడు? తప్పించుకోలేడు.

ఊరందరి బెంగల్నీ మొయ్యాల్సిందే. అందుక్కూడా ఆయన సిధ్ధపడ్డాడు. కానీ ఊరువరకూ ఆయన్ని వెళ్ళనిస్తే

కదా! వాడ బెంగలే కాళ్ళకు చుట్టుకున్నాయి. ఇంక కదలితే వొట్టు.

అందితే బేరం! అందకుంటే నేరం!

కళ్ళు మూసుకుంటే పదేళ్ళు గడిచిపోయాయి.
కాదు.. కాదు.. మనమంతా కళ్ళు మూసుకుంటూనే గడిచిపోయాయి..
పులులు ప్రోటీన్లున్న గడ్డి తిని బలుస్తున్నాయన్నారు. కళ్ళు తెరిచి చూడలేక పోయాయి.
లేళ్ళు కేవలం కార్బోహైడ్రేట్లు అన్నం తిని చిక్కి పోతున్నాయన్నారు. చూసే ధైర్యం చెయ్యలేక

పోయాం.
నీళ్లు లేని చోటకు నీళ్ళొస్తున్నాయి- అంటే పొలాల్లో వెతికాం. కానీ మునిగినవి కొంపలు.

చూసినా ప్రయోజనం లేదని కళ్ళు తెరవలేదు.
రైతుల ఆత్మహత్యలు వుండవు. అన్నారు. ఈ మాట మాత్రం నిజం. రేపు రైతే వుండడు. ఆ

పని కార్పోరేటు వ్యాపారి చేస్తాడు. ఆ సుందర దృశ్యం రేపు తర్వాత చూడవచ్చని కళ్ళు తెరవలేదు.
అతనెవరో ‘నాటు బాంబు నెత్తిమీద ఖద్దరు టోపీ’ పెట్టి- ‘అహింసా వర్థిల్లాలి’ అన్నాడు. చాలా

మంది ప్రత్యర్థులు నెత్తుటి మడుగుల్లో తేలారు. భయం వేసి కళ్ళు తెరవలేదు.
మిగిలిన ఒకరిద్దరూ ‘కంప్యూటర్‌’లో దాక్కుండి పోయి, సౌకర్యవంతంగా సవాళ్లు విసిరారు.

చూడటానికి విసుగనిపించి కళ్ళు తెరవలేదు.
అందితే బేరం! అందకుంటే నేరం!
మనమంతా కళ్ళు మూసుకుంటేనే పదేళ్ళూ గడిచిపోయాయి.

చిత్త ప్రసాద్‌ ‘రాతబడి’ చేశాడు!

నంది అంటే నంది
పంది అంటే పంది
అనే వాళ్ళను వంది మాగధులంటారు. ‘పంది’మాగధులని ఎందుకనరో!
అలాంటి ‘పంది’మాగధుడే ఒక ‘మధురమయి’న రాజ్యంలో ప్రధాన మంత్రిగా చెలామణీ అయిపోతున్నాడు.
ఆ రాజ్యం పేరు ‘రసగుల్లా రాజ్యం’. మంత్రికీ, రాజ్యానికీ ఏ మాత్రం పొంతన లేదు కదూ!
అందమైన దేశానికి అసహ్యకరమైన మంత్రి ఎందుకొస్తాడు? రాజుకు బుధ్ధిలేక పోతే సరి!
బుధ్ధిలేని రాజూ, గడ్డితినే మంత్రీ ఉద్యానవనంలో విహరిస్తుండంగా, నిజంగానే ఇద్దరూ పందిని చూశారు.
‘ఏమిటది?’ అన్నాడు బుధ్ధిలేని రాజు.
చిత్రం! పందిని పంది- అని చెప్పలేదు గడ్డితినే మంత్రి.
‘బక్కచిక్కిన ఏనుగు’ అన్నాడు.

‘ఫుడ్‌’ పాత్‌

పరమహంస చచ్చిపోయాడు.
కానిస్టేబుల్‌ పరమహంస దీనాతి దీనంగా, ఘోరాతి ఘోరంగా, హీనాతి హీనంగా పోయాడు.
అత్యంత చౌకబారుగా, అడుక్కునే వాడి చేతిలో అర్థరాత్రి అసువులు బాపాడు.
ఫుట్‌ పాత్‌ మీద ఆడ్డంగా బోర్లాపడివుంది శవం.
టాటాసుమో ఇంకా ఆగకుండానే దూకి వచ్చాడు డీసీపీ తాండవ్‌. గౌరవసూచకంగా తన ‘టోపీ’
తియ్యబోయాడు.
దాని మీద వున్న మూడు సింహాలూ గర్జించటం మాని, ముక్తకంఠంతో ‘మ్యావ’్‌ మన్నట్లు
అనిపించింది