
దాదాపు పాతికేళ్ళ క్రితం నాటి మాట. నేను ఆంధ్రభూమి దినపత్రిక విజయవాడ ఎడిషన్లో చీఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. సిధ్ధార్థ ఇంజనీరింగ్ కాలేజిలో దాకె బాలాజీ అనే విద్యార్థి తనను ప్రిన్సిపాల్ కులం పేరుతో అందరిలోనూ తిట్టినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్తను నేనే రాసి పత్రికలో వేశాను. ఆ తర్వాత మూడేళ్ళకు రాజమండ్రిలో ’కోస్తావాణి‘ అనే ప్రాంతీయ దినపత్రికకు సంపాదకుడిగా వున్నప్పుడు ఇలాంటిదే మరో ఘటన జరిగింది. అక్కడ కూడా ప్రిన్సిపాల్ కులం పేరుతో తిట్టినందుకు డొక్కా పద్మనాభ రావు అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని గాయాల పాలయి ఆసుపత్రిలో మరణించాడు. అప్పుడూ వార్త ప్రచురించాను. కానీ లోలోపల రెండు ఘటనలూ కుదిపేస్తూనే వున్నాయి. దు:ఖమో, ఆగ్రహమో తెలీదు కానీ, ఓ సాయింత్రం పూట కవిత్వరూపంలో పెట్టాను. అదే ’పంచమ వేదం‘.