సతీష్ చందర్ తో ఎన్. గుగీ

‘‘చర్చికి నాకూ సంబంధం లేదు. నేను క్రైస్తవుణ్ని కాను.’’ అన్నాడు జేమ్స్ గుగీ చర్చి ప్రాంగణంలోనే.
పరమ భక్తుడైన ఒక వృద్ధుడు ఈ మాటలకు ఊగిపోయాడు. ‘అలా అనడానికి సిగ్గులేదూ? పైపెచ్చు క్రైస్తవుడి పేరు పెట్టుకున్నావ్!’ అని వేలెత్తి కాదు
చేతి కర్రెత్తి చూపాడు. గుగీ ఆలోచనలో పడ్డాడు.
పేరుకీ, తన భావాలకి అంత పేచీవుందా? జీవితాన్నే కలగనే వాళ్ళూ, కలనే జీవితంగా మలచుకునే వాళ్ళూ ఇలాంటి తేడాలను భరించలేరు. తక్షణం ఒక నిర్ణయం తీసుకున్నాడు. సరికొత్త జన్మనెత్తాడు.
ఇప్పుడు గుగీ పచ్చిక మీద కొత్తగా కురిసిన మంచుబిందువు లాంటి వాడు. ఒక్క సూర్యకిరణాన్ని కూడా దాచుకోకుండా తనలోంచి ప్రసరింపజేసేవాడు. అతడే ఎన్.గుగీ వాథీయాంగో.
ఆ పేరు పెట్టుకున్న మరుక్షణం తన ఊరు నుంచి తనను వెతుక్కుంటూ వచ్చిన బెంగటిల్లిన పిట్ట ఒకటి పలకరించినట్టనిపించింది. అదే సంస్కృతి కాబోలు. తాతల నాటి కాలంలో వేసిన చిందులూ, చేసిన విందులూ, కలిసి పంచుకున్న కన్నీళ్ళూ, చిరునవ్వులూ..ఇవి కాక మరొకటుంటుందా సంస్కృతి అంటే.
పెళ్ళినాడు కొట్టిన డప్పే. సందర్భం వచ్చినపుడు యుద్ధభేరి అవుతుంది. మనం మరిచిన సంస్క ృతిపై శత్రువు దాడి జరిపినపుడు చేతిలోని కరవాలంగా సాక్షాత్కరిస్తుంది.
గుగీ సొంత దేశం కెన్యా సంస్కృతి అలాంటిదే. కెన్యా రక్త మాంసాలను గుట్టు చప్పుడు కాకుండా పీల్చిన తెల్లవాడి కుత్తుకపై ఈ సంస్కృతే కత్తిలా నిలిచింది. పాటలన్నీ ఈటెలయ్యాయి. లయలు సైనికుల కదలికలయ్యాయి. (గుగీ మాటల్లో చెప్పాలంటే
they adopted traditional rythms, songs and dances to the new needs of struggle.) కొంతమంది దబాయిస్తున్నట్లు `సంస్కృతి అంటే కట్టుబాట్లు కాదు. నూలు తాళ్లూ కాదు. అయితే ఈ దబాయింపులకు అమాయకపు ప్రజలు మోసపోతుంటారు. తెచ్చిపెట్టుకున్న సాంప్రదాయకతను సంస్కృతి ‘లేబెల్’ మీద అమ్మజూపాలనుకుంటారు.
కెన్యాలోనూ అదే ప్రయత్నం చేశారు. అయితే చాచి చెంపమీద కొట్టినట్లు గుగీ సంస్కృతిని ‘‘హోమ్కమింగ్’’ అనే పుస్తకంలో నిర్వచించాడు. ‘‘మనిషికి ఆత్మగౌరవాన్నీ, ఆర్థిక పరిపుష్టినీ ఇవ్వగలిగేది మాత్రమే నిజమైన సంస్కృతిగా గుర్తిస్తాను.’’ అని ప్రకటించాడు. ఈ రెంటికోసమే కలం పట్టాడు. కటకటాల వెనక్కివెళ్ళాడు . విశాలమైన కాంక్రీట్ అడవి లాంటి అమెరికాలో యూకటిలిప్టస్ చెట్టు మీద వాలిన పిట్టలా ప్రస్తుతం ప్రవాసముంటున్నాడు.
నేల మీద మాత్రమే నల్ల సూర్యుడు ఆ రోజు హైదరాబాదులో ప్రత్యేకంగా ఉదయించాడు. ఆ సూర్యుడు. ‘సీఫెల్’ ఆవరణలో మొక్కలు ఖుషీగా వున్నాయి. అన్ని రంగుల పువ్వులూ ఒకే నవ్వు నవ్వుతున్నాయి. అన్ని రంగులూ మామూలుగా కలిస్తే తెలుపవుతాయేమోగాని, సంఘటిస్తే మాత్రం నలుపే అవుతాయి. గెస్ట్హౌస్ ముందు మనుషులు కదను తొక్కిన పచ్చిక. అదేమిటో, సూర్యోదయానికి ముందు గడ్డిపరకలూ, పిచ్చుకలూ,పువ్వులూఅన్నీ యుద్ధ సంకేతాలే అవుతాయి.
లోపలకి వెళ్లగానే వెయిటింగ్ హాల్లో ఇద్దరు. కోట బురుజు మీద సైనికుల్లాగ. తుళ్ళిపడ్డ వృద్ధ సైనికుడు పలకరించాడు. రావలసిన చోటికే వచ్చావన్నట్టు కరచాలనం చేశాడు. వెంటనే ఆయన చేతుల్లో ఎర్రని పుస్తకం. పేరు ‘హోమ్కమింగ్’. అంటే నేను మాయింటికే వచ్చానన్నమాట
అని అనుకున్నాను. సంబరంతో నవ్వుకున్నాను. సైనికుడి నెరసిన తల నా నవ్వునిట్టే పసిగట్టింది. సూర్యుడు లొపలే వున్నాడు అన్న సమాచారాన్నందించింది. ఆ సైనికుడెవరో కాదు చలసాని ప్రసాద్. మరో సైనికుడు పలకరించిందే తడవుగా
మన వాడల్లోని సూర్యోదయాల్ని గురించి మాట్లాడాడు. ఖండాలు వేరుగాని ఉదయాల నలుపు ఒక్కటే. సీఫెల్ ఇంగ్లీష్ శాఖాధిపతి ఆయన.
సూర్యుడొచ్చాడు. కరచాలనం చేశాడు. నల్లని నిప్పు కణికను చూసినట్లయింది. అతడే ఎన్. గుగీ వాథియాంగో. పక్కనే ఉదయంలాంటి సహచరి. సూర్యోదయాలు రెండూ డైనింగ్ హాల్ వైపు నడిచాయి. బ్రెడ్డు ముక్కలు, ఆమ్లెట్లు, ఎర్రటి జామ్, ప్యాక్ చేసుకు వచ్చిన జ్ఞాపకాలూ.
ప్ర. మీరెందుకు రాస్తారు?
(ఆ ప్రశ్నకు విడతలు విడతలుగా నవ్వాడు. ‘‘ప్రశ్నను ఇంకాస్త పొడిగించండి’’ అన్నాడు రెండు బ్రెడ్డు ముక్కల్ని కలిపి తింటూ. ఆయన కోసం మరొక ప్రశ్న జత చేశాను. ‘‘ఎవరి కోసం రాస్తారు?’’ అయన వెంటనే కెన్యా వెళ్లిపోయారు
ఆలోచనల్లో.)
గుగీ: కెన్యా బ్రిటిష్ వాళ్ల వలస దేశంగా వుండే రోజులవి. సంవత్సరాల్లో అయితే 1902 నుంచి 1965 వరకు. తెల్లవాడి సొంత సొమ్ములా వుండేది కెన్యా. కెన్యా ప్రజలు స్వాతంత్య్రం కోసం యుద్ధం చేశారు. 1952 నుంచి 1962 వరకు ఒక దశాబ్ద కాలం పాటు ఈ యుద్ధం నడిచింది. యుద్ధంలో నా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎటు చూసినా సామూహిక చైతన్యం నాకు కనిపించేది. అందరి ఆవేశం నాలోకొచ్చి చేరుతున్నట్టనిపించేది. నన్ను నేను వ్యక్తం చేసుకోవాలనుకునేవాడిని. రచయిత కావడం వల్ల కాబోలు, అది సాధ్యమయ్యింది. నన్ను నేను వ్యక్తం చేసుకోవడం అంటే నన్ను నేను కనుగొనడమే. ఫలితంగా నేను రాశాను. ‘వీప్ నాట్ ఎ చైల్డ్ , ద రివర్ బిట్వీన్ , ఎ గ్రెయిన్ ఆఫ్ వీట్’ పుస్తకాలు అప్పుడు రాసినవే. అలా రాసినవే.
(‘నన్ను నేను వ్యక్తం చేసుకుంటాను’ అని ఆయన అనడంలో నల్ల జాతీయుడే, నల్ల జాతీయుడి గురించి రాస్తాడన్నట్టునిపించింది.)
ప్ర. మరి తెల్లవాడు నల్లవాడి గురించి రాస్తేనో?
గుగీ: ఎందుకు రాయకూడదు. రాయవచ్చు. (కొద్ది సేపు ఆలోచించి, మళ్ళీ కొనసాగించాడు.) నల్ల జాతీయుల పట్ల ప్రేమా, సానుభూతి ఉన్నతెల్లవాళ్లు రాయడంలో తప్పులేదు. అయితే వాళ్ళు నల్లవాళ్ల గురించి రాయవచ్చు కానీ, నల్ల వారి తరపున రాయకూడదు. నా జీవితానుభవం వాళ్ళకు తెలియదు. కాబట్టి నాకు వాళ్లు ప్రాతినిధ్యం వహించలేరు.
ప్ర.నల్ల కార్మికులున్నట్లు తెల్ల కార్మికులూ ఉంటారు కదా! ఏ రంగైనా కార్మికుడు కార్మికుడే. కష్టజీవి కష్టజీవే కదా! అలాంటప్పుడు తెల్లజాతి కార్మికుడి గురించి ఎందుకు రాయలేడు?
(ఈ ప్రశ్న వేశాను. సమాధానం వస్తుందనుకుంటున్న లోగానే పెద్దగా నవ్వుకుంటూ ప్రముఖ స్త్రీ వాద రచయిత సుశీతారు హాల్లోకి వచ్చారు. సూర్యుడితో ఆమె స్నేహపూర్వకమైన ఆలింగనం చేసుకున్నారు. గుగీ, తారు ఉగాండాలో ఒకో చోట చదువుకున్నట్లు గుగీయే స్వయంగా చెప్పారు. ఆవిడ తెల్లగా నవ్వారు. గుగీకి సమాధానం గుర్తొచ్చింది.
)
గుగీ: నిజమే తెల్ల కార్మికుడూ శ్రమ చేస్తాడు. నల్ల కార్మికుడూ శ్రమ చేస్తాడు. ఇద్దరూ పేదల్లో పేదల్లాగా ఒకే రకమైన ఆర్థిక భారాన్ని మోస్తారు. అయితే నల్ల జాతీయుడు ఆదనంగా మరొక భారాన్ని మోస్తాడు. అదే జాతి వివక్ష.
(‘మరి నల్ల జాతి స్త్రీయో?’ అనడుగుదామనుకున్నాను. కాని గుగీ మనసెరిగిన వాడు. అడక్కుండానే బదులిచ్చాడు.
)
ఆమె మూడు భారాలు మోస్తోంది: ఆర్థిక భారం, జాతి వివక్ష, జెండర్ తారతమ్యం. ఈ మూడు ఆమెను పట్టి పీడుస్తున్నాయి. ఈ పీడనల నుంచి ఆమె విముక్తం కావాలి. అందుకోసం ఆమె ముప్పేటగా పోరు సాగించాలి. ఈ విషయం అనుభవంలోకి వచ్చాకనే నేను ‘‘డెవిల్ ఆన్ ది క్రాస్’’
(తెలుగులో అనువాదం
‘మట్టి కాళ్ళ మహారాక్షసి’) రాశాను.
ప్ర. వీటన్నింటికీ కలిపి ఒక్క ఆర్థిక పోరాటం చేస్తే సరిపోదా?
(ఈ ప్రశ్న అనుకోకుండానే అడిగాను. నిజానికి నాకా ప్రశ్న నచ్చలేదు. అదేదో కోటా మేరకు పోరాటంలా అనిపించింది. గుగీ సహనశీలి. దానికి కూడా సమాధానం చెప్పారు.)
గుగీ: అసలు కీలకమైనవి ఆర్థిక పోరాటాలు. కానీ సాంఘిక పీడనలున్నప్పుడు సాంఘిక పోరాటాలు కూడా చేయాలి. అంటే ఒక పథకం ప్రకారం ఆర్థిక పోరాటాలాను ముగించుకుని, తర్వాత తీరిగ్గా జాతి విముక్తి గురించి, జెండర్ మిముక్తి గురించి పోరాటాలు చెయ్యడం కాదు. ఏ సమస్యయినా `సమస్యను వెన్నంటే పోరాటం ఉంటుంది. కొంతకాలం తర్వాత కాదు. ఇలా ఎందుకంటున్నానంటే ఆర్థికంగా మెరుగుపడ్డ ఒక నల్ల జాతీయుడికీ, అదే ఆర్థిక స్థాయిలో వున్న తెల్ల జాతీయుడికీ సంఘంలో ఒకే గౌరవం లేదు. కాబట్టి కేవలం ఆర్థిక సమస్యల పరిష్కారమే సకల సమస్యల పరిష్కారం కాదు. కాకుంటే ఎన్నో సమస్యలకు కేంద్ర బిందువు ఆర్థిక దోపిడీ.
ప్ర. కెన్యా తెల్లవాళ్ళ పాలనలో ఎక్కువ దోపిడీ కి గురయిందా? వారి రాక ముందు స్వజాతి ఫ్యూడల్ ప్రభువుల పాలనలో ఎక్కువ దోపిడీ కి గురయిందా?
గుగీ: ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ల పాలనలోనే కెన్యాను పూర్తిగా కొల్లగొట్టారు. అయితే వారి రాకముందు ఫ్యూడల్ ప్రభువుల లాంటి వాళ్ళు లేరు. నల్ల జాతిలోనే భిన్న శాఖల వారుండేవారు. అందరూ సమానమైన సాంఘిక స్థాయిలోనే వుండేవారు. ఆర్థిక దోపిడి ఇంతలేదు. కాకుంటే పితృస్వామ్యం మాత్రం వుండేది. ఆమేరకు స్త్రీల భంగపాటు తప్పదు కదా!’
ప్ర. బ్రిటిష్ వాళ్లు మీ సంస్కృతిని కూడా కొల్లగొట్టారని భావిస్తున్నారా?
గుగీ: వాళ్ల చేతుల్లో ఉన్న మేరకు కొల్లగొట్టారు. విద్యా సాంస్కృతిక రంగాల ద్వారా కెన్యా ప్రజల మనసుల్లో ఎంతో కొంత బానిస భావాన్ని నూరిపోయగలిగారు.
ప్ర. కెన్యాలో ప్రస్తుతం ఏ సాహిత్య ప్రక్రియ బాగా రాణిస్తోంది?
గుగీ: నాటకం. కెన్యా ప్రజల గొంతుకలోంచి వచ్చిన తొలికేక నాటకం. నా దేశ ప్రజలతో కలిసి నేను నాటకాన్ని సిద్ధం చేసినప్పుడే నన్ను అరెస్టు చేశారు. ఆ నాటకం పేరు ‘‘థండర్ ఫ్రం ద మౌంటెయిన్’’. ఆ తర్వాత రాణిస్తున్నది కాల్పనిక సాహిత్యం. కాని నాటకంలోనే సామూహిక అభివ్యక్తి బలంగా వుంటుంది.

సుశీ తారు మా సంభాషణలో ప్రవేశించి ‘‘తర్వాత బహుమానం గుగీదే’’ అని ప్రకటించారు. గుగీ సహచరి జరీ పగలబడి నవ్వారు. నిజంగానే గుగీకి ఈ బహుమానం ప్రకటించయినా, పాశ్చాత్య ప్రపంచం కొంత వరకు తన తెల్లని పాపాలను కడుక్కోగలుగుతుందేమో
ప్ర. తెల్ల వాళ్ళు రాసిన సాహిత్యం కన్నా నల్ల వాళ్ళు రాసిన సాహిత్యం ఉన్నత ప్రమాణాలతో ఉంటుందని అనుకుంటున్నారా?’’
గుగీ: అలా అని నేను అనను. మంచి సాహిత్యాన్ని సృష్టించిన తెల్ల వాళ్లు కూడా ఉన్నారు. షేక్స్పియర్ లాంటి వాళ్లు ఎంత మంది లేరు? వాళ్లు ఉన్నత ప్రమాణాల్లో సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళే. అయితే వాళ్లు స్పృశించిన అంశాలకీ, మేము స్పృశించే అంశాలకీి తేడా వుంటుంది. మేము వర్గం, జెండర్, జాతి, వంటి అంశాల మీద రాస్తుంటాం. అందుకే నా సాహిత్యాన్ని విభిన్నమైనదిగా చూడమంటాను.
ప్ర. భారతీయ రచయితలు రాసినవి ఎప్పుడైనా చూస్తుంటారా?
గుగీ: ఈ మధ్యన రాస్తున్న వాళ్లు నాకు తెలియరు కాని కొంత కాలం క్రితం అయితే ముల్క్ రాజ్ ఆనంద్, ఆర్.కె.నారాయణ్, ఫైజ్ అహ్మద్ల రచనలు చదివాను. ముల్క్రాజ్ ఆనంద్ రాసిన ‘కూలి’, ‘అన్ టచబుల్‘ నవలలనయితే నేను క్లాసులో బోధించాను కూడా.
ప్ర. మీ రచనల్లో కెల్లా ఉత్తమ రచనగా దేన్ని భావిస్తారు?
గుగీ: నేనింకా చేయని రచనని. (పెద్దగా నవ్వాడు. మళ్లీ తేరుకుని) మొదటి సారిగా నేను నా మాతృభాషలో రాసిన ‘డెవిల్ ఆన్ ద క్రాస్’’ అంటే నాకిష్టం.
ప్ర. ఇప్పటికైనా ప్రపంచం నల్లజాతి సాహిత్యాన్ని ఉత్తమ సాహిత్యంగా గుర్తిస్తుందా?
గుగీ: గుర్తించడం తప్పనిసరయింది. ఇప్పటికే నల్ల జాతీయులైన వోలె సోయంకా, డెరెక్ వాల్కాట్, టోనీ మారిసన్ లకు నోబెల్ బహుమానాన్నిచ్చారు.’
(ఇలా అన్నాడో, లేదో వెంటనే పక్కనే ఉన్న సుశీ తారు మా సంభాషణలో ప్రవేశించి ‘‘తర్వాత బహుమానం గుగీదే’’ అని ప్రకటించారు. గుగీ సహచరి జరీ పగలబడి నవ్వారు. నిజంగానే గుగీకి ఈ బహుమానం ప్రకటించయినా, పాశ్చాత్య ప్రపంచం కొంత వరకు తన తెల్లని పాపాలను కడుక్కోగలుగుతుందేమో.)
1996, వార్త (సృష్టి, సాహిత్యపేజీలో)
You may give your opinion on this interview
Anacha veyabadda prajala tarupuna Elanti ento mandi Ravali alantappudee ee samajam marpunaku lonavada modaloutundi, eppudu anyayam vaipu, abhagyula vaipu,vivaksha vaipu,baditula vaipu under maa satish chandar sir ee interview cheyadam valana enno vishayalu gugi nunchi bayataku vachhaii Nice interview గురువు garu
Nice sir