Tag: దళిత ప్రేమ లేఖ

దళిత ప్రేమ లేఖ

సునీత ఒక దళిత విద్యార్థిని. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్( పెంట్రల్ యూనివర్శిటీ)లో చదువుతూ వుండేది.అక్కడే చదువుతున్నయోగేశ్వర రెడ్డి అనే అగ్రవర్ణ యువకుణ్ణి ప్రేమించింది. అతడి కారణంగా ఆమె మూడుసార్లు గర్భవతియై అతని సలహా మేరకు అబార్షన్ చేయించుకుంది. కడకు అతడు ఒక రోజున ఆమెకు ఓ వార్త చెప్పాడు తనకు తన వాళ్ళు వేరే రెడ్ల అమ్మాయితో పెళ్ళి నిశ్చయించారని. ఈ వార్త విన్న సునీత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన 1995 లో జరిగింది. ఆమె చనిపోతూ ఒక ఉత్తరం రాసి పెట్టింది. అప్పుడు నేను వార్త దిన పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా వున్నాను. ఈ లేఖను చదివాను. వాడినేమీ చెయ్యలేమా అనిపించింది. ఆమె మరణ వార్తను ప్రముఖంగానే ప్రచురించాను. కానీ ఏదో తెలియని అవమానం. ఇలాంటి సునీతలు ప్రతీ క్యాంపస్ లోనూ రహస్య వేదనను అనుభవిస్తుంటారు కదా- అని పించింది. ఫలితమే ఈ కవిత. తొలుత ఇండియాటుడే సాహిత్య సంచికలో వెలువడింది. నా ’ఆదిపర్వం‘ కవితా సంకలనం ఈ కవితతో ముగుస్తుంది.